న్యూస్4అజ్: భార్యకు కరోన అనగానే పరార్.. ఊపిరాడక ఆమె మృతి…
అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త, భార్యకు చిన్న కష్టం రాగానే పారిపోయాడు. ఆ అభాగ్యురాలు వైద్యమందక మరణించగా కడసారి చూపునకు కూడా అతడు రాలేదు. కరోనాపై ఉన్న అపోహలు మానవ సంబంధాలను ఛిద్రం చేస్తున్నాయనడానికి ఈ దారుణం ఒక సజీవ ఉదాహరణ. ఎక్కడో మారుమూలన కాదు, ఐటీ సిటీ బెంగళూరులోనే ఈ ఘోరం జరిగింది. గౌరి (27), మంజునాథ్ రెండేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చి బాడుగ ఇంట్లో జీవిస్తున్నాడు. భార్య ఒక షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్గా, భర్త మరోచోట డ్రైవర్గా పనిచేసేవాడు. బుధవారం ఆమెకు జ్వరం రాగా, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని వచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని ఫోన్ చేసి చెప్పారు. దీంతో భర్త మరుక్షణమే భార్యను వదిలిపెట్టి ఉడాయించాడు. ఆమెకు శ్వాసకోశ సమస్య అధికం కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె శుక్రవారం ఇంట్లోనే మృతిచెందింది.
ఇంటి యజమాని, పలుమార్లు మంజునాథ్కు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. చివరికి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఇక మృతురాలి బంధువులకు ఫోన్ చేసి చెప్పగా, ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లినరోజు నుంచే సంబంధం తెగిపోయిందని చెప్పేశారు. చివరకు కార్పొరేటర్ తదితరులే కార్పొరేషన్ అంబులెన్స్ను రప్పించి అంత్యక్రియలు జరిపించారు.
