న్యూస్4అజ్: హైదరాబాద్: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఎన్డీపీఎస్లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ రికవరీ కోసం ఆమెను వివిధ ప్రాంతాలకు ఎన్సీబీ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నార్కోటిక్స్ పోలీసులు ఈ కేసులో పలువుర్ని అరెస్టు చేశారు. రియా సోదరుడు శౌవిక్తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ కూడా ఎన్సీబీ ఆధీనంలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో గత మూడు రోజుల నుంచి రియాను ఎన్సీబీ విచారించింది. జూన్ 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే.
వైద్య పరీక్షలు.. రియాకు వైద్య పరీక్షలు చేయనున్నారు. డ్రగ్స్ తీసుకున్నదేమో అన్న కోణంలో ఎన్సీబీ అధికారులు ఆమెకు డ్రగ్స్ పరీక్షలు చేయించనున్నారు. మెడికల్ పరీక్ష తర్వాత రియాను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు. రియా సోదరుడు శౌవిక్ చక్రవర్తే తన సోదరికి డ్రగ్స్తో లింకు ఉన్నట్లు చెప్పాడు. ఎన్సీబీ సీజ్ చేసిన ఫోన్ల ఆధారంగా.. రియాకు డ్రగ్ కార్టల్స్తో లింకులు ఉన్నట్లు తేలింది. డ్రగ్స్ కేసులో ఏ1ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. వైద్యపరీక్షల కోసం ఆమెను సియాన్ హాస్పిటల్కు తీసుకువెళ్లనున్నారు.